Animal Husbandry

సెక్స్‌ సార్టెడ్‌ సెమన్‌ ద్వారా పశువుల్లో ఆడ దూడల వృద్ధి! కేవలం 250 రూపాయిలే

Sandilya Sharma
Sandilya Sharma
Sex sorted semen scheme in AP  Gokul Mission benefits  పశుగణాభివృద్ధి పథకం  ఆడ దూడల పథకం
Sex sorted semen scheme in AP Gokul Mission benefits పశుగణాభివృద్ధి పథకం ఆడ దూడల పథకం

జాతీయ కృత్రిమ గర్భధారణ పథకం కింద పశుగణాభివృద్ధి సంస్థ చేపట్టిన "సెక్స్‌ సార్టెడ్‌ సెమన్‌" విధానం రాష్ట్రంలో ఆశాజనక ఫలితాలను ఇస్తోంది. ఈ విధానం ద్వారా పశువుల్లో అధిక శాతంలో ఆడ దూడల జననం జరుగుతూ, పాడి రైతులకు ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 650 ఆడ దూడలు జన్మించినట్లు పశుగణాభివృద్ధి సంస్థ సీఈవో డాక్టర్‌ మల్లేశ్వరి తెలిపారు.

పద్ధతి విశేషాలు

 జాతీయ గోకుల్‌ మిషన్‌ ద్వారా అమలవుతున్న ఈ విధానం ద్వారా సెక్స్‌ సార్టెడ్‌ సెమన్‌ను 65 శాతం సబ్సిడీతో రైతులకు అందిస్తున్నారు. ఒక్కో డోసుకు ప్రభుత్వం రూ.425 సబ్సిడీ అందజేస్తుండగా, రైతులు కేవలం రూ.250 చెల్లించి  ఈ సేవను పొందవచ్చు. పశువుకు ఈ సెమన్‌ ఇంజెక్షన్‌ ఇచ్చిన 21 రోజుల్లో గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ గర్భం దాల్చకపోతే, రెండో డోసు కోసం మరో రూ.250 చెల్లించి మళ్లీ ఇంజెక్షన్‌ చేయించుకోవచ్చు. మొదటి సారి చెల్లించిన డబ్బును రైతులకు తిరిగి ఇవ్వడం ద్వారా వారికి భారం లేకుండా చూడుతున్నారు.

ప్రయోగంలో భాగంగా విస్తృత పంపిణీ

 రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70 వేల సెక్స్‌ సార్టెడ్‌ సెమన్‌ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 15,915 డోసులు ఎదకొచ్చిన పశువులకు అందజేసినట్లు సమాచారం. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా, అందులో అనుభవజ్ఞులైన వైద్యులు, గోపాలమిత్ర సభ్యులు ఉన్నారు. వారు ఈ కృత్రిమ గర్భధారణ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.

ఆధునికీకరణతో పెరుగుతున్న ఆడ దూడల అవసరం

 అగ్రికల్చర్‌ ఫామ్‌ మెకనైజేషన్‌ పెరుగుతున్న నేపథ్యంలో దున్నలు, కోడె దూడల అవసరం తగ్గిపోయింది. ఇక ఆడ దూడలు పుట్టడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది పాడి రైతులకు స్థిర ఆదాయాన్ని తీసుకువచ్చే అవకాశం కల్పిస్తోంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్డీడీపీ సాంకేతికతో అద్భుత మార్పులు

 జాతీయ పాల అభివృద్ధి బోర్డు (NDDB) ఆధ్వర్యంలో X, Y క్రోమోజోములను వేరుచేసే ఆధునిక సాంకేతికతను రాష్ట్రంలో పరిచయం చేయడం ఈ మార్పులకు దారితీసింది. ఈ టెక్నాలజీ ద్వారా సుమారు 96 శాతం దాకా ఆడ దూడలే జన్మించే అవకాశముండటం వల్ల రైతుల్లో విశ్వాసం పెరుగుతోంది.

రాష్ట్రంలో పశుగణాభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నం పాడి రైతులకు పెద్ద ఎత్తున ఉపశమనాన్ని అందిస్తోంది. ఈ విధానం మరింత విస్తృతంగా అమలవుతుండగా, పశుసంపదను పెంపొందించేందుకు ఇది ప్రధాన ఆధారంగా మారుతుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి.

Read More :

నకిలీ విత్తనాల మోసాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి: రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి

వానాకాలం సీజన్‌కి రంగం సిద్ధం: రాష్ట్రవ్యాప్తంగా 1.31 కోట్ల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యం

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More