Government Schemes

ఏపీ ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతులకు శుభవార్త, రైతులకు రూ.2 లక్షల వరకూ మద్దతు

Sandilya Sharma
Sandilya Sharma
ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా రైతులకు రూ.2 లక్షల మద్దతు
ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా రైతులకు రూ.2 లక్షల మద్దతు

రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు అందించింది. తిరిగి ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా ఉచిత బోర్లు, రాయితీపై పంపుసెట్లు, ముఖ్యంగా సోలార్ పంపు సెట్లు అందించనుంది. రైతులకు మద్దతుగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ కుసుమ్ (KUSUM) పథకంతో అనుసంధానించడం ద్వారా పెట్టుబడి భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టాయి.

విజయవంతమైన పథకం పునరావృతం

2014–2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరి పేరుతో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. అప్పట్లో వేలాది మంది రైతులు ఈ పథకం లబ్ధిదారులుగా నిలిచారు. కేంద్ర సహకారంతో సోలార్ పంపుసెట్లు, ఉచిత బోర్లు అందజేశారు. తరువాత వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పథకాన్ని వైఎస్సార్ జలకళగా కొనసాగించింది.

ఇప్పుడు నూతనంగా ఏర్పడిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, రైతులకు మళ్లీ అదే ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది.

బడ్జెట్ కేటాయింపు – రూ.50 కోట్లు

2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ.50 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. పథకాన్ని సక్రమంగా అమలు చేయడానికి సంబంధిత శాఖలు వివరణాత్మక ప్రణాళిక రూపొందిస్తున్నాయి. ముఖ్యంగా సోలార్ పంపుసెట్ల ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని, అవసరమైతే విద్యుత్ ఆధారిత పంపుసెట్లు కూడా అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

కుసుమ్ పథకంతో అనుసంధానం – లబ్ధిదారుల నిధి వాటా

ఈ పథకాన్ని కుసుమ్ (KUSUM) పథకంతో అనుసంధానం చేయడం ద్వారా రైతులకు పెద్ద మేలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కుసుమ్ పథకంలో కేంద్రం 40%, రాష్ట్రం 30% రాయితీ, మిగిలిన 30% లబ్ధిదారుడు భాగస్వామిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో గతంలో మంచి ఫలితాలు రావడంతో అదే మోడల్‌ను కొనసాగించనున్నారు.

ఉపయోగాలు – రూ.2 లక్షల వరకు రైతుకు లాభం

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక బోరు వేయడం, పంపుసెట్టు అమర్చడం కోసం కనీసం రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతోంది. అయితే ఎన్టీఆర్ జలసిరి పథకం ద్వారా ఇదంతా రాయితీగా లేదా ఉచితంగా లభించనున్నందున, రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడి భారం నుంచి బయటపడతారు. అంటే ఒక్కొక్కరికి సుమారు రూ.2 లక్షల మోస్తరు లాభం కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

త్వరలో మార్గదర్శకాలు విడుదల

పథకం అమలుకు సంబంధించి పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖతో చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలో యూనిట్ ఖర్చు, రాయితీ శాతం, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి విషయాలపై క్లారిటీతో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ ప్రతిపాదనలు తీసుకెళ్లి, ఆయన ఆమోదంతో తదుపరి చర్యలు చేపడతామని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు.

రైతులకు సాగునీటి సౌకర్యం అందించడమే కాకుండా, సోలార్ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ జలసిరి పథకం మళ్లీ వస్తుండటం ఎంతో సానుకూల పరిణామం. ఈ పథకం ద్వారా రైతుల భారం తక్కువై, సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు, పంట దిగుబడులూ మెరుగవుతాయనే ఆశలు ఉన్నాయి. రైతులు సకాలంలో సమాచారాన్ని సేకరించి, తమ అప్లికేషన్లను సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Read More:

చెరువుల పూడికను వ్యవసాయానికి వినియోగించండి – రైతులకు మట్టిపై కీలక అనుమతులు

ఉద్యానవన సాగు విస్తరణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు – రైతు ఆదాయం పెంచే దిశగా కీలక చర్యలు

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More