News

లక్షల మంది అకౌంట్లలో రైతు భరోసా జమ: డబ్బు పడకపోతే ఇలా చేయండి!

KJ Staff
KJ Staff

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ. 1,766 కోట్లను జమచేసింది. వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ పథకం మూడో విడత నిధులు, అక్టోబర్‌లో వచ్చిన నివర్‌ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కింద ఇస్తామన్న నిధుల్ని ప్రభుత్వం జమ చేసింది.

వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ. 1,120 కోట్లు, నివర్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ. 646 కోట్లను చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కంప్యూటర్‌ బటన్ నొక్కి రైతుల అకౌంట్లలో నేరుగా చెల్లింపులు చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో శుభకార్యానికి ఈరోజు శ్రీకారం చుట్టామని చెప్పారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతులకు మంచి ధరలు రావాలనేదే తమ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం రైతు రుణ మాఫీ కింద రూ. 87,612 కోట్లు మాఫీ చేస్తానని చెప్పి రైతులను నిలువునా ముంచిందని ఆరోపించారు. రైతులకు. కేవలం రూ.12 కోట్లు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ చెప్పింది. ధాన్యం, విత్తనం, ఇన్సూరెన్స్, విద్యుత్ బకాయిలు, సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించాం. గత ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్న 434 కుటుంబాలకు సాయం చేశాం. వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్ కింద రూ.13,101 కోట్లు అందించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలకు రూ,13,500 ఇస్తున్నాం. కౌలు రైతులకు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు సాయం చేశాం.

ఇక, డబ్బు పడ్డాయో, లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. రైతు భరోసాకు సంబంధించి ఏ సమస్య వచ్చినా 155251 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. స్టేటస్‌కు సంబంధించిన వివరాలు ఈ https://ysrrythubharosa.ap.gov.in/RBApp/index.html  క్లిక్ చేసి చూడండి.

Share your comments

Subscribe Magazine