News

భూ వివాదాల పరిష్కార బాధ్యత కలెక్టర్లకు

KJ Staff
KJ Staff

హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రావడానికి ముందు జరిగిన భూముల రిజిస్ట్రేషన్ల వివరాలను రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించే (పెండింగ్‌ మ్యుటేషన్లు) అధికారం జిల్లా కలెక్టర్లకు దఖలు పర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌ మ్యుటేషన్లను జిల్లా కలెక్టర్లు పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు. ఇందుకు మీ-సేవా ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు. కోర్టు కేసులు ఉన్న భూములు మినహా పార్ట్‌-బీలోని సాగు భూములకు సంబంధించిన సమస్యలన్నింటినీ రెండు నెలల వ్యవధిలో కలెక్టర్లు పరిష్కరిస్తారని ప్రకటించారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి, యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్దేశించారు. ఇందుకు అవసరమైన సందర్భాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. గురువారం ధరణి పోర్టల్‌, సాగు భూముల సమస్యలపై ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో తెచ్చిన ధరణి పోర్టల్‌ ఆశించిన ఫలితాలనిస్తోందని, పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు నెలల వ్యవధిలోనే 1.1 లక్షల మంది ధరణి ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకుని, వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తి చేసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో 90 శాతం మంది రైతులు ఐదు ఎకరాల లోపు వారే ఉన్నారని, అలాంటి చిన్న రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూములు రిజిస్టర్‌ చేయించకుని, మ్యుటేషన్‌ చేయించుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగు పరుస్తున్నట్లు వెల్లడించారు. సమీక్షలో మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, కార్యదర్శులు శేషాద్రి, స్మితా సభర్వాల్‌, కలెక్టర్లు పాల్గొన్నారు.

మరికొన్ని ఆదేశాలు

పట్టాదార్‌ పాసు బుక్కులు పోయినట్లయితే, వాటి స్థానంలో సర్టిఫైడ్‌ కాపీ తీసుకునే అవకాశం కల్పించాలి.

ప్రభుత్వ భూములు, చెరువు  ఎఫ్‌టీఎల్‌ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్‌ భూములు, అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లో పైవ్రేటు వ్యక్తులకు రిజిస్టర్‌ చేయవద్దు.

ఇనామ్‌ భూములను సాగు చేసుకుంటున్న హక్కు దారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి, ఆ వివరాలను ధరణిలో నమోదు చేయాలి.

ధరణిలో స్లాట్‌ బుక్‌ కాకపోతే, ఎందుకు కావడం లేదనే విషయం దరఖాస్తు దారుడికి తెలిపే ఆప్షన్‌ ధరణిలో ఉండాలి.

విస్తృత చర్చల అనంతరం జారీ అయిన ఆదేశాలు

రెవెన్యూకోర్టుల్లోని భూముల వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకొకటి చొప్పున కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలి.

1/70 చట్టం అమలులో లేని ప్రాంతాల్లో ఆ చట్టం కింద నమోదైన కేసులను పరిష్కరించాలి. అమల్లో ఉన్న చోట ఆ ప్రాంత గిరిజనరుల హక్కులు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి.

రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణానికి తేడాలుంటే కలెక్టర్లు విచారణ జరిపి, తుది నిర్ణయం తీసుకోవాలి. ఆ వివరాలను ధరణిలో నమోదు చేసి, పాసు బుక్కులు ఇవ్వాలి.

ఒక సర్వే నంబర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములుంటే ఆ సర్వే నంబర్‌ అంతా నిషేధిత జాబితాలో పెట్టారు. అలాంటి కేసులు ఉన్న చోట కలెక్టర్లు విచారణ జరిపి ప్రభుత్వ భూములను మాత్రమే నిషేధిత జాబితాలో పెట్టాలి.

కోర్టుల ద్వారా, కలెక్టర్ల ఆధ్వర్యంలోని ట్రైబ్యునళ్ల ద్వారా వచ్చిన అధికారిక తీర్పుల ప్రకారం ధరణిలో భూములకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేపట్టాలి.

ధరణి పోర్టల్‌ ద్వారా లీజ్‌ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి.

నాలా ద్వారా కన్వర్ట్‌ అయిన భూములను ధరణిలో నమోదు చేసి, ప్రొసీడింగ్స్‌ ఇవ్వాలి.

అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌ కమ్‌ జీపీఏ చేసుకోవడానికి ధరణి పోర్టల్‌ ద్వారా అవకాశం ఇవ్వాలి.

వ్యవసాయ భూముల లీజు డీడ్‌, ఎక్సేంజ్‌ డీడ్‌ల రిజిస్ట్రేషన్లకు ధరణిలో అవకాశం ఇవ్వాలి.

సాగు భూముల్లో నెలకొల్పే కంపెనీలు, వివిధ సంస్థలు ఆ భూములను అమ్ముకునేందుకు, కొనుక్కునేందుకు ధరణిలో అవకాశం కల్పించాలి.

పాస్‌ పోర్టు నంబరు నమోదు చేసుకుని ఎన్‌ఆర్‌ఐ భూములకు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలి.

ఈసీ, మార్కెట్‌ వ్యాల్యూ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌ లో ప్రింట్‌ తీసుకునే అవకాశం కల్పించాలి. 

స్లాట్‌ బుక్‌ చేసుకున్న రోజు రాలేకపోయే వారికి స్లాట్‌ రద్దు చేసుకోవడానికి, మరో రోజు బుక్‌ చేసుకునే చాన్స్‌ ఇవ్వాలి. స్లాట్‌ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగివ్వాలి.

చట్టబద్ధ వారసుల పేర్లను రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లలో అనుమతిదారుల కేటగిరీ కింద నమోదు చేసుకునే ఆప్షన్‌ కలిగించాలి.

మైనర్ల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేటప్పుడు మైనర్లు, సంరక్షకుల పేర పాస్‌ పుస్తకం ఇవ్వాలి.

అసైన్‌ చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములను బదలాయించాలి

Share your comments

Subscribe Magazine