భారతదేశమంత ఎండలతో భగ్గుమంటుంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. శీతల ప్రాంతాలైన జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి రోజు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రాలో కొన్ని చోట్ల వర్షాలు పడిన మిగిలిన ప్రాంతాల్లో సూర్యుడు తన ప్రభావం చూపిస్తూనే ఉన్నాడు.
![](https://telugu-cdn.b-cdn.net/media/4r2l1aba/varaha-helps-indian-farmers-cut-back-climate-damaging-practices-resembling-burning-crop-residue-and-flooding-rice-fields-_-techcrunch-junaid-jiwani.jpg)
ఇటువంటి పరిస్థితుల్లో ఐఎండి చల్లని కబురుతో ముందుకు వచ్చింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరానికి చేరినట్లు స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు దేశ వ్యవసాయానికి జీవనాధారమైనవి. ఈ రుతుపవనాల్లో కురిసే తొలకరి జల్లులతో ఖరీఫ్ సీసన్ ప్రారంభమవుతుంది. మరోపక్క ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని ఐఎండి ఇప్పటికే ప్రకటించింది, దీని వలన ఈ సంవత్సరం ఖరీఫ్ పంట నుండి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది.
నైరుతి రుతుపవనాలు గురువారం ఉదయం భారత భూభాగాన్ని తాకాయని వాతావరం శాఖ వెల్లడించింది. లక్షద్వీప్ మరియు కేరళ ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించడానికి అనుకూలంగా ఉన్నాయని, మరో 2-3 రోజుల్లో ఈ రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్ చేరుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఎండలకు ఉక్కిరిబిక్కరవుతున్న ప్రజలకు ఇది ఒక తీపి కబురుగా చెప్పవచ్చు.
ఈ రుతుపవనాలు ప్రజలకు ఎండ నుండి ఊరట కల్పించడంతో పాటు వ్యవసాయానికి కూడా ఎంతో సాయం చెయ్యనున్నాయి. మన దేశంలో వర్షాధారిత వ్యవసాయం చేసే రైతులకు ఈ రుతుపవనాలు మూలం, దేశంలో 52% నికర సాగు భూమికి ఈ వర్షపాతమే ఆధారితం. కేవలం ఈ భూభాగం నుండే 40% ఆహారం ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టే దేశ ఆహార భద్రతలో ఈ రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయని అంటారు.
Share your comments