News

వ్యవసాయ రుణాలపై 1.5 వార్షిక వడ్డీ రాయితీ ఆమోదించిన కేంద్ర మంత్రిమండలి..

Srikanth B
Srikanth B

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఇవాళ సమావేశమైంది. ఈ సందర్భంగా- అన్ని ఆర్థిక సహాయ సంస్థల్లోనూ స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై 1.5 శాతం వార్షిక వడ్డీ రాయితీ పథకం పునరుద్ధరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం (ప్రభుత్వ-ప్రైవేటు రంగ, స్వల్ప రుణ, ప్రాంతీయ గ్రామీణ, సహకార బ్యాంకులుసహా కంప్యూటరీకరించబడి, వాణిజ్య బ్యాంకుల అధీనంలోగల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు వగైరా) ఆర్థిక సహాయ సంస్థలకు 1.5 శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుంది.

ఈ మేరకు 2022-23 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో రూ.3 లక్షల వరకూ రైతులకు మంజూరు చేసిన స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీ లభిస్తుంది. ఈ పథకం కింద వడ్డీ రాయితీ పొడిగింపుతో అదనపు బడ్జెట్ కేటాయించవల్సి ఉంటుంది దానికి అనుగుణంగా 2022-23 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాలకు రూ.34,856 కోట్ల మేర నిధులు కేటాయించబడతాయి.

వార్షిక వడ్డీ లాభాలు ప్రయోజనాలు:

వడ్డీ రాయితీ పెంపుతో వ్యవసాయ రంగంలో రుణ ప్రవాహ స్థిరత్వం ఏర్పడటమేగాక రుణాలిచ్చే సంస్థల ఆర్థిక సుస్థిరత, మనుగడకు భరోసా లభిస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రుణాల మంజూరుకు నిధుల లభ్యతపై హామీ ఉంటుంది. నిధుల వితరణలో వ్యయం పెరుగుదలను బ్యాంకులు తట్టుకోగలుగుతాయి.

తద్వారా స్వల్పకాలిక వ్యవసాయ అవసరాల కోసం రైతులకు అవసరమైనంత రుణాలు మంజూరుచేసే వీలుంటుంది. అంతేకాకుండా మరింత మంది రైతులు వ్యవసాయ రుణ ప్రయోజనం పొందగలుగుతారు. అదేవిధంగా పశు పోషణ-పాడి, కోళ్ల-చేపల పెంపకం వంటి కార్యకలాపాలు సహా స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు లభిస్తాయి కాబట్టి ఉపాధి అవకాశాల సృష్టికీ తోడ్పాటు ఉంటుంది. సకాలంలో తిరిగి చెల్లించే రైతులు 4 శాతం స్వల్ప వార్షిక వడ్డీతో వ్యవసాయ రుణాలను సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తుంది.

MSPపై ఆగస్టు 22న జరగనున్న కమిటీ సమావేశాన్ని SKM తిరస్కరించింది..

ఈ పథకం కింద వ్యవసాయంతోపాటు పశుపోషణ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, చేపల పెంపకం వంటి ఇతర అనుబంధ కార్యకలాపాలు నిర్వహించే రైతులకూ 7 శాతం వడ్డీతో రూ.3లక్షల దాకా స్వల్పకాలిక వ్యవసాయ రుణం లభిస్తుంది. రుణాలను క్రమం తప్పకుండా, సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు అదనంగా 3 శాతం వడ్డీ రాయితీ (ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్-పీఆర్‌ఐ) లభిస్తుంది.


అందువల్ల ఒక రైతు సకాలంలో రుణం చెల్లిస్తే అతనికి 4 శాతానికే రుణం లభించినట్లు అవుతుంది. రైతులకు ఈ సదుపాయం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేసే ఆర్థిక సంస్థలకు వడ్డీ రాయితీని అందిస్తుంది. ఈ మద్దతు కింద కేంద్రం 100 శాతం నిధులు సమకూరుస్తుంది. బడ్జెట్ వ్యయం, లబ్ధిదారుల సంఖ్య పరంగా ఇది వ్యవసాయం-రైతు సంక్షేమ శాఖకు సంబంధించిన రెండో అతిపెద్ద పథకం అవుతుంది.

మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా… ముఖ్యంగా ఆర్థిక సహాయ సంస్థలకు- ప్రత్యేకించి సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మంజూరు చేసే రుణాలపై వడ్డీ శాతాలతోపాటు వాటికి అందే ఆర్థిక సహాయంపై విధించే వడ్డీ రేట్ల పెరుగుదలను ప్రభుత్వం సమీక్షించి తాజా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వ్యవసాయ రంగంలో రైతులకు రుణ సాయం కోసం తగినంత రుణ ప్రవాహ లభ్యతకు భరోసా ఉంటుంది. దీంతోపాటు రుణ మంజూరు సంస్థల ఆర్థిక మనుగడకు హామీ లభిస్తుందని అంచనా.

ఈ సవాలును పరిష్కరించడంలో భాగంగా అన్ని ఆర్థిక సంస్థలకూ స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై 1.5 శాతం వార్షిక వడ్డీ రాయితీని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో నిర్ణయం తీసుకుంది.

MSPపై ఆగస్టు 22న జరగనున్న కమిటీ సమావేశాన్ని SKM తిరస్కరించింది..

Share your comments

Subscribe Magazine