Agripedia

మామిడి పిందెలు రాలకుండా నిర్మూలన చర్యలు

S Vinay
S Vinay

ఫల రారాజు మామిడి ప్రస్తుతం పిందెలు కాసే దశలో ఉంది. ఈ దశ మామిడి దిగుబడికి చాలా కీలకం కాబట్టి పిందెలు రాలకుండా కాపాడుకోవడం చాల అవసరం. సాధారణంగా ఒక పూరెమ్మకి 5 నుండి 6 పిందెలు కాస్తాయి కానీ వివిధ కారణాల వల్ల ఈ పిందెలు తొలి దశలోనే రాలిపోతున్నాయి చివరికి ఒక పూరెమ్మకి ఒకటి లేదా రెండు వరకు మిగిలిపోతున్నాయి ఫలితంగా తీవ్ర నష్టం చేకూరుతుంది. కాబట్టి దీనిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పిందెలు రాలిపోవడానికి ప్రధానమైన కారణాలు:

*వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం

*పోషకాల లోపాలు.

*సాగు నీరు సరైన సమయానికి అందకపోవటం (నీటి ఎద్దటి)

*అధిక ఉష్ణోగ్రత

*హార్మోన్ల విడుదలలో సమతుల్యత లోపించటం

*మరియు పిందెలు ఏర్పడే దశలో పురుగుల/తెగుళ్ల తాకిడి ఉండటం.

నివారణ చర్యలు:

* పిందెలు చిన్న పరిణామంలో వున్నప్పుడు పది గ్రాముల యూరియాని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పిందెలు రాలడం ఆపవచ్చు.

*పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల పిందెలు రాలటం ఆగిపోయి వాటి నాణ్యత కూడా పెరుగుతుంది.

*పోటాష్ ఎరువులను వేపపిండిలో కలిపి చెట్లకు వేసుకోవాలి.

చీడ పీడల తాకిడిని అరికట్టడం: మామిడి పిందె దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, తేనెమంచు పురుగులు ,పండు ఈగలు, బూడిద తెగులు మరియు మచ్చల తెగులు వంటి వాటి తాకిడి ఎక్కువగా ఉంటుంది

*రసం పీల్చే పురుగులకు 2 మి.లీ ఫిప్రోనిల్ ని ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి .

*ప్రధానంగా తేనె మంచు పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది వీటిని నివారించడానికి 0.3 మీ.లీ ల ఇమిడాక్లోప్రిడ్ ని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

*బూడిద తెగులు నివారణకు మూడు గ్రాముల గంధకాన్ని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి

*పండు ఈగలను అదుపులో పెట్టడానికి మిథైల్ యుజినాల్ ట్రాపులను తోటలో అక్కడక్కడ అమర్చుకోవాలి.

నీటి సరఫరా:

*పిందె దశలో వున్నప్పుడు రెండు వారాల వ్య్వవధిలో రెండు నుండి మూడు దాకా నీటి తడులు ఇవ్వాలి తద్వారా సత్పలితాలు ఉంటాయి .

అంతే కాకుండా 10 మీ.లీ (NAA ) నాప్తలీన్ అసిటిక్ ఆసిడ్ ని 50 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా పిందెలు రాలడాన్ని అరికట్టవచ్చు.

 

ఇంకా చదవండి

పంట వ్యర్థాలను దహించకుండా ఫలవంతగా వాడుకుందాం ఇలా

భూసార పరీక్ష అమలు పరచండి ఇలా

Share your comments

Subscribe Magazine